పోలవరం నిర్వాసితులకు రూ.306 కోట్ల ప్యాకేజీ, ఇళ్ల తాళాలు అందించిన సీఎం చంద్రబాబు

  • పోలవరంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని తెలిపిన సీఎం చంద్రబాబు
  • నిర్వాసితులకు నాలుగో విడతగా రూ.306 కోట్ల పరిహారం విడుదల
  • 23 నెలల్లో నిర్వాసితులకు రూ.2,250 కోట్లు చెల్లించిన కూటమి ప్రభుత్వం
  • చంద్రబాబు సీఎం అయ్యాకే తమకు న్యాయం జరుగుతోందన్న నిర్వాసితులు
  • 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తమ ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని, నిర్వాసితుల సంక్షేమం పట్ల ప్రత్యేక అభిమానంతో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పుట్టపర్తి పర్యటన ముగించుకుని అమరావతి వచ్చిన ఆయన, శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వాసితులకు నాలుగో విడతగా రూ.306.61 కోట్ల పరిహారం, పునరావాస (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీని అందించారు. పలువురు లబ్ధిదారులకు ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో నిర్మించిన ఇళ్ల తాళాలను అందజేశారు.

సర్ ఆర్థర్ కాటన్ జయంతి రోజున నిర్వాసితులకు పరిహారం అందించడం సంతోషంగా ఉందని సీఎం అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల్లో 29,936 మంది నిర్వాసితులకు సుమారు రూ.2,250 కోట్లు చెల్లించామని గుర్తుచేశారు. "ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు నష్టపోకూడదనేదే నా ఆలోచన. అందుకే ప్రత్యేకంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేశాం. 2027లో జరిగే పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం" అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వ నిర్వాకం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆయన విమర్శించారు. "గత పాలకులు కాంట్రాక్టర్లను మార్చి, అధికారులను మార్చి ప్రాజెక్టును నాశనం చేశారు. మేం మళ్లీ ప్రాజెక్టును గాడిలో పెట్టాం. నిర్వాసితుల్లో ఒక్కరికి కూడా అన్యాయం జరగనివ్వను" అని భరోసా ఇచ్చారు. టెక్నాలజీని ఉపయోగించి గిరిజన ప్రాంతాల్లో ప్రతి కుటుంబ ఆదాయం పెంచుతామని, రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో మాట్లాడిన నిర్వాసితులు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే తమ సమస్యల పరిష్కారంపై నమ్మకం కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పరిహారంపై ఆశలు వదులుకున్నామని, వరదల సమయంలో కనీస సహాయం కూడా అందలేదని వారు ఆవేదన చెందారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే తమకు మంచి రోజులు వచ్చాయని, పండుగల సందర్భంగా సైతం పరిహారం అందిస్తుండటం సంతోషంగా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, మిరియాల శిరీషా దేవి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Chandrababu Naidu
Polavaram project
Polavaram rehabilitation
AP Polavaram
Polavaram compensation
Andhra Pradesh irrigation
Nimmala Ramanaidu
Chirri Balaraju
Miriyala Sirisha Devi

More Telugu News